Telugu Bible |సంఘ పితరుల చరిత్ర |Church History Telugu 1

సంఘ పితరుల సంక్షిప్త చరిత్ర! 

Church History Telugu

యేసుప్రభువు సిలువ-మరణ-పునరుత్థానముల వలన సంఘానికి పునాది వేయబడెను. “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” (మార్కు 16:15) అన్న ఆజ్ఞను పాటించిన శిష్యులు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును మొదటి శతాబ్దం లోనే సువార్తను ప్రకటించిరి. గనుక మొదటి శతాబ్దపు సంఘానికి శిష్యులు నాయకత్వము వహించిరి. 

  వారు ప్రకటించిన సువార్త వలన రక్షించబడిన విశ్వాసవీరులనేకులు రెండవ శతాబ్దములో సంఘాన్ని నడిపించారు. మూడు, నాలుగు, ఐదు, ఆరు శతాబ్దాలలో జీవించి; సంఘానికి సేవ చేసిన పెద్దలు ‘సంఘ పితరులు’ అని పిలువబడిరి. వీరిలో అనేకులు బైబిల్లోని సత్యాలను బయలుపరచి, అందరికీ అందుబాటులో ఉండునట్లుగా వాఙ్మయ సేవను చేసారు. వీరిలో ముఖ్యులైన కొందరు సంఘ పితరులను గూర్చి క్లుప్తంగా తెలుసుకొందాం!  Church History Telugu

  •  సిప్రియన్                                      (క్రీ.శ. 200 -258) 
  • అతినేషియన్                                 (క్రీ.శ. 295-373) 
  • కైసరయ వాడైన బాసిల్                 (క్రీ.శ. 329-379) 
  • నాజియాంజస్ వాడైన గ్రెగోరి         (క్రీ.శ. 329-389) 
  • నిస్సావాడైన గ్రెగోరి                          (.. 330-395) 
  • జెరోమ్                                              (క్రీ.శ. 342-420) 
  • జాన్ క్రిసోస్టం                                    (క్రీ.శ. 346-407) 
  • ఆంబ్రోస్                                            ( 339-397) 
  • అగస్టీన్                                             (క్రీ.శ. 354-430) 

   * సిప్రియన్ (క్రీ.శ. 200-258) : సిప్రియన్ క్రీ.శ. 200లో ఉత్తర ఆఫ్రికాలోని కార్తేజ్లో జన్మించాడు. క్రీ.శ. 246లో క్రైస్తవుడయ్యాడు. పాండిత్యాన్ని సంపాదించుకొని క్రీ.శ. 248లో బిషప్ అయ్యాడు. ఈయన బిషప్ అయిన కొంత కాలంలోనే క్రైస్తవులకు డీసియస్ ద్వారా హింసలు ప్రారంభమయ్యెను. అయితే రోమా ప్రభుత్వం యొక్క బలవంతం వలన, ఆస్తులు పోవుననే భయం వలన అన్య దేవతలకు బలి యిచ్చినవారిని సంఘంలో చేర్చుకోరాదని; అయితే విశ్వాసం కోల్పోయినవారు నిజంగా పశ్చాత్తాప పడిన యెడల వారిని సంఘంలో చేర్చుకో వచ్చునని చెప్పి సంఘాన్ని బలపరచాడు. సిప్రియన్ వైరాగ్యం గలవానిగా, సేవా దృక్పథం గలవానిగా ఉన్నందున ఆ దినాల్లో ఉన్న ప్రతీ శోధనను ఎదుర్కొనగలిగాడు. 

  * అతినేషియన్ (క్రీ.శ. 295-373) : అతినేషియన్ క్రీ.శ. 295లో జన్మించాడు. చిన్ననాటి నుండే మతాసక్తి గలవాడు. ఒక వేదాంతిగా, రచయితగా, సంఘ పరిపాలకుడుగా, నైసియా విశ్వాస ప్రమాణ నిర్మాణకుడుగా, శ్రమలను భరించిన దైవసేవకుడుగా క్రైస్తవ సంఘ చరిత్రలో స్థిరంగా నిలిచిపోయాడు. అతినేషియన్ క్రీ.శ. 328లో బిషప్ గా నియమించబడి; సంఘ క్రమశిక్షణ కొరకు, సరైన సిద్ధాంతాల కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. ఏరియన్ విమతాన్ని ధైర్యంగా, ఒంటరిగా ఎదుర్కొని; అనేక హింసలకు గురై, చివరికి క్రీ.శ. 373 మే నెల 2వ తేదీన ఈ లోకయాత్రను ముగించాడు. Church History Telugu

   * కైసరయ వాడైన బాసిల్ (క్రీ.శ. 329-379) : ఇతడొక ధనవంతుని కుటుంబములో జన్మించాడు. న్యాయశాస్త్ర పండితుడు, వాఙ్మయాభిలాషి! అయితే సంతృప్తి లేక సేవకు సమర్పించుకొన్నాడు. క్రీ.శ. 364లో అభిషేకించబడి, కైసరయలో బిషప్ నియమించబడ్డాడు. మంచి పరిపాలకుడిగా పేరుపొందాడు. ఏరియన్ చక్రవర్తి ద్వారా వచ్చిన ఇబ్బందులన్నిటిని ధైర్యంతో, విశ్వాసంతో ఎదుర్కొన్నాడు; సంఘాన్ని సంస్కరించాడు; వైద్యశాలను, కుష్ఠురోగులకు శరణాలయాన్ని నిర్మించాడు; ఆరాధన క్రమాలు సిద్ధం చేసాడు. 

  * నాజియాంజస్ వాడైన గ్రెగోరి (క్రీ.శ. 329-389) : గ్రెగోరి క్రీ.శ. 329లో జన్మించాడు. ఇతని తల్లి భక్తిపరురాలు, తండ్రి బిషప్! తన ముప్ఫైయవ సంవత్సరములో బాప్తిస్మము పొంది, తండ్రికి పరిచర్యలో సహాయం చేసాడు. తప్పుడు సిద్ధాంతాలను ఎదుర్కొన్నాడు. కాన్స్టంట్ నోపుల్లో ఏరియన్ సిద్దాంతం విస్తరిస్తున్నదని ఎరిగి, విశ్వాస ప్రమాణాన్ని అక్కడి ప్రజలకు బోధించడానికి వెళ్ళాడు. ఒక ఇంటిలో ప్రార్థనలు పెడుతూ, సార్వత్రిక సంఘ సిద్ధాంతాలను చక్కగా బోధిస్తుండెను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఏకత్వాన్ని చక్కగా బోధించేవాడు. చివరికి ఆ ఇల్లు ఒక సంఘముగా మారినది. 

  * నిస్సావాడైన గ్రెగోరి (క్రీ.శ. 329-389): ఇతడు కప్పదొకియ సంఘ పితరులలో ఒకడు, బాసిల్కు తమ్ముడు. ఇతడొక గొప్ప వక్త, రచయిత, వేదాంతి, పరిపాలనా దక్షుడు, మంచి విద్యావంతుడు. ఇతడు తన అన్నయైన బాసిల్ స్థాపించిన పరిశుద్ధుల శిబిరంలో కొంత కాలం ఉన్నాడు. ఆ తరువాత క్రీ.శ. 371లో నిస్సా సంఘానికి బిషప్ గా నియమించబడ్డాడు. అయితే ఏరియన్ చక్రవర్తి ఇతని విశ్వాసాన్ని బట్టి పదవీ భ్రష్ఠునిగా చేసి, క్రీ.శ. 376లో చెరలో ఉంచాడు. ఆ చక్రవర్తి మరణించిన తరువాత క్రీ.శ. 378లో గ్రెగోరి తన బిషప్ పదవిని తిరిగి పొందాడు. ఇతడు యేసుక్రీస్తును గూర్చి మంచి ఉపన్యాసాలు యిస్తూ, చాలా గ్రంథాలు వ్రాసాడు. క్రీ.శ. 395లో మరణించాడు.  Church History Telugu 

  * జెరోమ్ (క్రీ.శ. 342-420): ఇతని అసలు పేరు యూసీబియస్ హీరానిమస్. ఇతడు అగస్టీన్కు సమకాలికుడు. ఇతని తల్లిదండ్రులు సార్వత్రిక సంఘ సభ్యులు. ఇతడు రోమ్లో చదివాడు. పరిశుద్ధుల శిబిరంలో చేరి, హీబ్రూ భాషను నేర్చుకొన్నాడు. క్రీ.శ. 379లో అంతియొకయకు గురువుగా ఎన్నుకోబడ్డాడు. నూతన నిబంధనను లాటిన్ భాషలోనికి తర్జుమా చేసాడు. జెరోమ్ వాఙ్మయ సేవలో, శిబిర జీవిత విధానంలో, వేదాంత ధోరణిలో ముందుకు సాగాడు. ఇతడు సత్యాన్వేషి, మంచి గ్రంథ పఠనం చేసినవాడు. మహా పండితుడు, వివాదాల ప్రియుడు కాని యథార్థవాది! ఇతను అనేక ఉత్తరాలు వ్రాసాడు. ఆ ఉత్తరాలే ఆనాటి సంఘ చరిత్రను, పరిస్థితులను తెలుసుకొనుటకు కారణమైనవి. చివరికి క్రీ.శ. 420లో ప్రభువు సన్నిధికి చేరాడు. 

   జాన్ క్రిసోస్టం (క్రీ.శ. 346-407) : క్రిసోస్టం అనగా ‘బంగారపు నోరు’ అని అర్థం! ఇతడు క్రీ.శ. 346లో అంతియొకయలో జన్మించాడు. ఇతడు క్రైస్తవుడైన తరువాత తాను చేస్తున్న న్యాయవాద వృత్తిని వదిలి, నిక్కచ్చియైన పరిశుద్ధునిగా జీవించుటకు పరిశుద్దుల శిబిరంలో చేరాడు. ఇతడు క్రీ.శ. 386లో అంతియొకయ సంఘానికి గురువుగా నియమించబడ్డాడు. ఇతడు అనుదిన జీవితానికి అవసరమైన అంశాలను బైబిల్లో నుండి వెదకి, సాంఘిక జీవితానికి అవసరమైన సందేశాలుగా అందిస్తుండేవాడు. 15 సంవత్సరములు సంఘానికి అతడు అందించిన సందేశాలను బట్టి, అతనికి ‘బంగారపు నోరు’ అని బిరుదు యివ్వబడినది. మరియు అతడు బైబిలులోని గ్రంథాలపై చక్కటి వ్యాఖ్యానాలను సిద్ధపరచాడు. కుకుకస్ అనే స్థలంలో కూడా అద్భుతమైన సేవ చేసి, బానిసలుగా అమ్మబడినవారిని విడిపించాడు. ‘గోత్లు’ అనే మొరటు జాతివారికి సువార్తను అందించాడు. చివరికి క్రీ.శ. 407లో మరణించి, ప్రభువు సన్నిధికి వెళ్ళాడు. Church History Telugu

  * ఆంబ్రోస్ (క్రీ.శ. 339-397) : ఆంబ్రోస్, ‘ట్రైయర్’ అనే స్థలంలో క్రీ.శ. 339లో జన్మించాడు. ట్రైయర్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నది. ఇతని తండ్రి ఒక ప్రభుత్వోద్యోగి. ఆంబ్రోస్ రోమ్ లో న్యాయశాస్త్రాన్ని చదివిన తరువాత ఇటలీ దేశం లోని విమిలియా అనే స్థలంలో గవర్నర్గా నియమించబడ్డాడు. అయినప్పటికి సంఘ కార్యక్రమాల యెడల ఆసక్తి కలిగియుండెను. అట్టి సమయంలో మిలాన్ సంఘ బిషప్ మరణించగా, ఆంబ్రోస్ బిషప్ నియమించబడ్డాడు. అతడు తనకున్న 

     ఆస్తిని అమ్మి, బీదలకిచ్చి, ఆ పదవిని స్వీకరించాడు. ఆంబ్రోస్ చాలా ధైర్యశాలి! ప్రభువు బల్ల విషయంలో ఖచ్చితంగా ఉండేవాడు. చక్రవర్తియైనా తప్పు ఒప్పుకోనిదే బల్లలో పాలుపంపులు పొందనిచ్చేవాడు కాదు. ఆంబ్రోస్ అనేక వేదాంత గ్రంథాలను, గీతాలను కూడా వ్రాసాడు. బైబిలు గ్రంథాలపై వ్యాఖ్యానాలను, క్రైస్తవ నీతి శాస్త్రాన్ని, విశ్వాస ప్రమాణాన్ని వివరంగా తెలియజేసాడు. ఆయన వ్రాసిన గ్రంథాలను బట్టి ఆయనను సంఘం ‘డాక్టరు’గా గుర్తించింది. క్రీ.శ. 397లో అతడు మరణించి, ప్రభువు నొద్దకు వెళ్ళాడు. Church History Telugu

  * అగస్టీన్ (క్రీ.శ. 354-430) : క్రీ.శ. 354లో నుమిడియాలో ఉన్న ‘టగెస్టే’ అను స్థలంలో అగస్టీన్ జన్మించాడు. తండ్రి పాట్రిసియస్ అన్యుడు, అయితే తల్లి మోనికా క్రైస్తవురాలు. కుమారుని కొరకు కన్నీటి ప్రార్థనలు చేసిన భక్తిపరురాలు! కాని అగస్టీన్ రసికుడు. అలంకార శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు. తన 17 సంవత్సరాల వయస్సులో ఒక ఉంపుడుకత్తెతో తన జీవితాన్ని వ్యర్థపరచుకొనేవాడు. అయితే తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వలన ఆంబ్రోస్ అందిస్తున్న దైవ సందేశాల వలన, ఆనాటి పరిశుద్ధుల శిబిరంలో ఉన్నవారి సాక్ష్యము వలన ఒక దినము అతనిలో గొప్ప మార్పు కలిగినది. ‘రోమా 13:13,14 వచనములు చదువుము’ అన్న ఒక స్వరమును విన్నాడు. ఆ వచనములు చదివిన వెంటనే అతనిలో సంపూర్ణమైన, అద్భుతమైన మార్పు కలిగినది. Church History Telugu

     ఆ తరువాత ఈస్టర్ దినమున ఆంబ్రోస్ వద్ద బాప్తిస్మము తీసుకొని, దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొన్నాడు. హిప్పో సంఘానికి గురువుగా అభిషేకించ బడ్డాడు. తరువాత బిషప్ గా నియమించబడి; అనేక విమతాలను, తప్పుడు సిద్ధాంతాలను ఎదుర్కొన్నాడు. సంతుష్టి చెందని అగస్టీన్, పరిశుద్ధుల శిబిరాన్ని స్థాపించాడు. సంఘ ఆధ్యాత్మికాభివృద్ధికి కృషి చేసాడు. సంఘ వేదాంతాన్ని నిర్మించి, సంఘ కట్టడలను స్థాపించాడు. చివరికి క్రీ.శ. 430లో మరణించి, ప్రభువు నొద్దకు చేరాడు. Church History Telugu


ప్రత్యక్ష గుడారం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here 

Leave a comment

error: dont try to copy others subjcet.