అంశం : ఓబద్యా
Obadiah Telugu
అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏఐదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను (1 రాజులు 18:3-4).
పరిశుద్ధ గ్రంధమైన బైబిల్లో 13మంది ఓబద్యాలు ఉన్నారు. ఓబద్యా అనగా “యెహోవాను ఆరాధించుట” అని అర్ధం కరువు కాలంలో అహాబు ఇంటిలో గృహనిర్వాహకుడుగా ఉన్నట్లు చూస్తున్నాం. అయితే కరువు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే యెజెబెలు చేసే విగ్రహారాధనను బట్టి దేశములో కరువు వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే నేనేమి విగ్రహారాధన చేయడం లేదు అనుకుంటారు. దేవుని వాక్యం చెబుతుంది దేవుని కంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తారో అదే విగ్రహారాధన. చాలామంది సినిమాలను మానలేరు అది వారి జీవితంలో ఒక విగ్రహం. టి.వి. సీరియల్ను మానలేరు. ఇంకా సిగరెట్, త్రాగుడు ఇవన్నీ కూడా వారి నిత్యజీవితంలో విడిచిపెట్టలేనివిగా ఉండి వారి హృదయాల్లో విగ్రహాలుగా మారిపోయాయి. పైకి వ్యక్తులు బాగా కనిపించుచున్నారు గాని లోపల ఇలాంటి విగ్రహాలను పెట్టుకొని దేవునిని విస్మరించుచున్నారు. నీలో ఇటువంటి విగ్రహములుంటే నేడే యేసుప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకొని ప్రార్థించు. ఆయన నీ పాపములను, అవిధేయతలను క్షమించి నిత్యజీవమునకు వారసులుగా చేస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును (1యోహా 1:9) Obadiah Telugu
చాలామంది దేవుడు చేసిన మేలులను మరిచిపోయేవారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 103:1-2 వచనాలలో దావీదు అంటున్నాడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. తద్వారా తన జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. ఎవరైతే దేవునిని ఆరాధిస్తారో వారిని ఆయన హెచ్చించును. దావీదు అంతకంతకు వర్ధిల్లెను (1 సమూ 18:30). దేవుని ఆరాధించువారు వర్ధిల్లుదురు. (కీర్తన 115:13-14)లో పిన్నలనేమి, పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును, మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రభువు చేసిన మేలులను మరిచిపోయే వారిని విశ్వాసఘాతకులు అంటుంది. (యెహెజ్కేలు 14:12,13) నరపుత్రుడా ! ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా జేసి కరువు పంపించి మనుష్యులను, పశువులను నిర్మూలము చేయుదును. ఎవరైతే దేవుని విసర్జించి ఆయన చేసిన మేలులను ఉపకారములను అనుభవించి కృతజ్ఞత లేనివారుగా ఉంటారో వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారి జీవితాల్లో కరువు, అసమాధానము కనబడుతుంది. మరి నీవు ఓబద్యా వలె దేవున్ని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా లేక విశ్వాస ఘాతకుడుగా, విశ్వాస ఘాతకురాలుగా ఉన్నావా? ఒకసారి పరిశీలించుకో. ఓబద్యా విగ్రహారాధనతో కూడిన దేశంలో కూడా నిజమైన దేవునిని సత్యవంతుడైన ప్రభువును ఆరాధిస్తున్నాడు. నీవు ఏ పరిస్థితులలో ఉన్నా, నీవు పని చేసే చోట ప్రభువుకు సాక్షిగా ఉన్నావా? నీ కాలేజ్లో నీవు ప్రభువును మహిమపరిచే వ్యక్తిగా ఉన్నావా? లేక వారితో కలిసిపోయే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియ సహోదరుడా ! సహోదరి ! Obadiah Telugu
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను (యోహాను 4:24). చాలామంది దేవుని ఆరాధిస్తున్నామండి అంటారు అయితే ఆదివారం ఆరాధనకు వస్తారు, మధ్యాహ్నం మేట్నీలో ఉంటారు. ఇదేనా ఆరాధన? అందుకే ప్రభువే అంటున్నాడు “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది (మత్తయి 15:7). మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు. ప్రభువునందు ప్రియమైనవారలారా! ఓబద్యా దేవుని వ్యర్థముగా ఆరాధించుట లేదు, భయభక్తులతో ఆరాధిస్తున్నట్లు చూస్తున్నాం. నమ్మకముగా ఆరాధిస్తున్నాడు. ఈ మాటలు చదువుచున్న ప్రియుడా! నీవు దేవుని, ఏ రీతిగా ఆరాధిస్తున్నావు. ఆయనను ఘనపరుచు చున్నావా? కీర్తన 111:1లో “యెహోవాను స్తుతించుండి, యదార్థవంతుల సభలోను, సమాజములోను పూర్ణహృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. Obadiah Telugu
- ఓబద్యా బాల్యము నుండి యెహోవాయందు భయభక్తులు నిలిపినవాడు (1 రాజు 18:12) :
ఈ దినములలో చాలామంది భక్తి గలిగి యున్నారు గాని భయము లేనివారుగా యున్నారు. భయముతో కూడిన భక్తి ఎంతో అవసరము. ఒక సోదరుడు దొంగతనమునకు వెళ్ళేముందు ప్రార్థన చేశాడట. ప్రభువా నాకేమైన దొరికినచో మీకు దశమ భాగం ఇచ్చుకుంటానన్నాడు. ఎంత విచారము! యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే (సామె 8:13).
- పాపము ఒప్పుకోవాలి (1 యోహాను 1:9)
- విడిచిపెట్టాలి (సామె 28:13)
- అసహ్యించుకోవాలి (సామె 8:13)
అబ్రాహాము తన కుమారుని మోరియా పర్వతము మీద దేవునికి దహనబలి ఇచ్చుటకు సిద్ధపడుట ద్వారా దేవునికి భయపడువాడని సాక్ష్యము పొందెను (ఆది 22:12). మనుష్యులు ఇచ్చు సాక్ష్యము కంటె ప్రభువు ఇచ్చు సాక్ష్యము గొప్పది గదా. భయభక్తులు యొక్క నిర్వచనము యాకోబు 1:27లో వ్రాయబడియున్నది. ఇహలోకమాలిన్యము అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక గేదె బురదలో దొర్లి మనకెదురుగా వచ్చుచున్నప్పుడు మనము దాని నుండి ప్రక్కకు పోవుదము గదా ! నీవు లోకములో ఉండవచ్చును గాని లోకము నీలోనికి రాకూడదు. కుమ్మరిపురుగు మంటిలో తిరుగును గాని మట్టి అంటించుకొనదు. తామరాకు నీటిలో ఉండును గాని నీరు దానిమీద ఉండదు. విశ్వాస జీవితము ఆవిధముగా అభివృద్ధి చెందవలెను. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించ వలెను. మదర్ థెరీసా యుగోస్లేవియా దేశము నుండి కలకత్తా నగరము వచ్చినప్పుడు మిషనరీస్ ఆఫ్ ఛారిటిని స్థాపించి దిక్కులేనివారిని, విధవరాండ్రను ఆదరించెను. అందువలన ఆమెకు నోబుల్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె నోబులెస్ట్ ఉమెన్ గా పిలువబడ్డారు. Obadiah Telugu
ఓబద్యా బాల్యమునుండి భయభక్తులు గలవాడు. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు దేవునికి పరిచర్య చేసెను (1 సమూ 3:1). ప్రభువు బాల్యకాలములోనే నీతో మాట్లాడుచున్నాడు (యిర్మీయా 2:21). కాని నీవు వినుట లేదు. కొంతమంది పిల్లలు ఇంటిదొంగలు, బడి దొంగలు, గుడిదొంగలుగా ఉంటారు. అట్టివారు ఆశీర్వదించబడరు. నీ బాల్యదినములలోనే మారుమనస్సు పొంది సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఆయనకు సమర్పించుకొనుము. జాన్వెస్లీ చిన్నతనములో ప్రభువు దగ్గరకు వచ్చుట వలన ఇంగ్లాండ్ దేశ అపొస్తలుడు అని పిలువబడెను.
2.) ఓబద్యా యెహోవా స్రవక్తలను పోషించెను (1 రాజు 18:4) యెజెబెలు దేవుని ప్రవక్తలను నిర్మూలము చేయుచుండెను. సాతానుకు దేవుని సేవ, దైవసేవకులు అంటే చాలా కోపము. ఏదోవిధముగా దేవుని పనిని పాడుచేయవలెనని వాడు ప్రయత్నము చేస్తాడు. అయితే ఓబద్యా దేవుని సేవకులను ప్రేమించి వారిని దాచిపెట్టాడు. నూరు మందిని గుహలో దాచి పోషించాడు. ఈ విషయము యెజెబెలుకు అహాబుకు తెలిసినచో అతనికి శిక్షపడుతుంది. అయినను ప్రాణమును కూడ లెక్కచేయ లేదు. తన ప్రాణము కంటె ఎక్కువగా ప్రభువును ఆయన సేవకులను ప్రేమించెను. నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును అని ప్రభువు చెప్పెను. యేసు నామము కొరకు తన ప్రాణము అర్పించుటకు సిద్ధముగా ఉన్నాను అని పౌలు గారు చెప్పారు (అపొ.కా. 21:13). ప్రియమైన సోదరీ, సోదరుడా ప్రభువు కొరకు ఏదైనా కార్యము చేయుటకు నీవు సిద్ధముగా యున్నావా? రాహాబు అను వేశ్య యెహోషువ పంపిన వేగుల వారిని మిద్దె మీద నున్న జనుపకట్టెలో దాచెను. దైవసేవకులను ప్రేమించెను. అది ఆమె ఆశీర్వదించబడుటకు కారణమాయెను. వారు ఇచ్చిన ఎఱ్ఱని దారము తన కిటికీకి కట్టుకొనుట వలన ఆమెకు ఆమె ఇంటివారందరికి రక్షణ కలిగెను (యెహోషువ 2:18). ఎఱ్ఱనిదారము మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యము. యేసురక్తము పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకములను కలిపికుట్టిన ఎఱ్ఱని దారముగా ఉన్నది. అందువలన ఆదికాండములో ప్రభువువారు చర్మపు చొక్కాయిలు చేయించి ఆదాము హవ్వలకు తొడిగించెను అని వ్రాయబడియున్నది (ఆది 3:21). ప్రకటన గ్రంథములో వధింపబడిన గొఱ్ఱపిల్ల అని యున్నది (ప్రక 5:6). గొఱ్ఱపిల్ల రక్తము ఇశ్రాయేలీయులను మరణము నుండి తప్పించినది. రాహాబు తన ఇంటివారి రక్షణకు కారకురాలాయెను. యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె చేర్చబడెను. ప్రియ సోదరీ సోదరుడా నీవును నీ యింటివారు రక్షింపబడియున్నారా? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీయింటివారు రక్షింపబడుదురు (అపొ.కా. 16:31). Obadiah Telugu
- యేసు రక్తము ప్రతి పాపమును కడుగును (1 యోహా 1:7)
- రక్తము నీతిమంతులునుగా తీర్చును (రోమా 5:9)
- పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము కలుగజేయును (హెబ్రీ 10:20)
- రక్తము మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును (హెబ్రీ 9:4)
- రక్తము విమోచించును (1 పేతురు 1:18-19)
షూనేమీయురాలు ఎలీషాను దైవజనుడని గుర్తించి ఆయనకు గోడమీద ఒక చిన్నగదిని కట్టించి అందులో ఆయన కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఏర్పాటు చేసెను (2 రాజు 4:10). అందుచేత ఆమెకున్న కొరత తీర్చబడెను. నీవు ప్రభువును, ఆయన సేవకులను ప్రేమించినట్లయితే ప్రభువు నీ అవసరతలు తీర్చును (ఫిలిప్పీ 4:19). అకుల, ప్రిస్కిల్లా అను భార్యాభర్తలు దైవజనుడైన పౌలు గారిని ఎంతో ప్రేమించి ఆయన కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు సిద్ధపడిరి (రోమా 16:3). యూదులు పౌలును చంపవలెనని తలంచినప్పుడు వీరు దైవజనుని దాచిపెట్టిరి. మరియు ఆయనతో జతపనివారుగా ఉండిరి. ప్రియుడా నీవు దైవజనునికి మంచి ఆతిథ్యము ఇచ్చుచున్నావా? ఫిలిప్పీ సంఘము కూడా పౌలు గారి అవసరములను తీర్చుచూ వచ్చిరి (ఫిలిప్పీ 4:15). ఓబద్యా దేవుని ప్రవక్తల యెడల ఎంతో శ్రద్ధ గలిగి వారిని పోషించెను. నీవు నీ కుటుంబము ఆలాగున సమర్పించుకొనగలరా?
3.) ఓబద్యా ఏలియా వర్తమానమును అహాబుకు తెలియచేసెను (1 రాజు 18:16) : ఏలియా పేరు ఎత్తగానే అహాబు, యెజెబెలు మండిపడుతూ ఉండేవారు. అయినను ఓబద్యా ధైర్యము చేసి వర్తమానము చెప్పెను. కన్నవాటిని విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలేము అని పేతురు యోహానులు చెప్పిరి (అపొ.కా. 4:20). పౌలు, అగ్రిప్ప రాజు ముందు నిలువబడి సాక్ష్యమిచ్చెను. దక్షిణ కొరియాలో ప్రభువు సేవ చేయుచున్న పాల్ యాంగిచో గారు సండేస్కూల్కు వెళ్ళుచున్న ఒక చిన్న పాప చెప్పిన సువార్త ద్వారా రక్షింపబడి క్షయరోగము ద్వారా విడుదల పొంది గొప్ప దైవజనుడుగా సేవలో ముందుకు సాగుచున్నారు. యవ్వనుడైన తిమోతి లుస్త్ర, ఈకొనియ సంఘములలో మంచి సాక్ష్యము గలవాడుగా ఉండెను (అపొ.కా. 16:2). సాక్ష్యమనునది ఆత్మకు ఉజ్జీవము, దేవునికి మహిమ, సాతానుకు కొరడా వంటిది అని ఒక భక్తుడు చెప్పారు. ప్రతి దేశములో ఇతర దేశముల హై కమీషనర్స్ ఉంటారు. వారు తమ తమ దేశములను గూర్చి, అభివృద్ధిని గూర్చి మాట్లాడుతూ ఉంటారు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి క్రీస్తు రాయబారులము (2 కొరింథీ 5:20). సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యము సుఖారు గ్రామమును మార్చెను. ఒకప్పుడు గ్రుడ్డివాడను, ఇప్పుడు చూచుచున్నాను అదే సాక్ష్యము (యెహాను 9:25). డా॥ డేవిడ్ లివింగ్స్టన్ దేవుని వర్తమానమును ఆఫ్రికా ఖండమునకు తీసుకొని వెళ్ళినప్పుడు నరమాంస భక్షకులు మార్పు చెందిరి. ప్రియమైన సోదరీ, సోదరుడా నీకు మంచి సాక్ష్యము గలదా? ప్రభువు వర్తమానమును నీ బంధువులకు, స్నేహితులకు తెలియజేయుచున్నావా? ఓబద్యా వలె మనము కూడా దేవుని వర్తమానమును అనేకులకు అందించుదము. ప్రభువు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక! Obadiah Telugu
All Pdf…….Download